గడువు తర్వాత శ్రీ కృష్ణ కమిటీ నివేదికలు తీసుకోవద్దు !: కోదండరాం

నిర్ణీత గడువు పూర్తయిన తర్వాత జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నివేదికలు తీసుకోవద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం కోరారు. “మంత్రి దానం నాగేందర్ కమిటీకి మరో నివేదిక ఇస్తామని అంటున్నారు. నివేదికల స్వీకరణకు కమిటీ విధించిన గడువు ఈనెల 10తో ముగిసింది. ఆ తర్వాత ఎవరికీ అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి” అని అన్నారు. “తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ అభిప్రాయం ఏమిటి ? వారు అధికారికంగా తెలియజేస్తారా ? లేదా ? పార్టీ అభిప్రాయానికి నేతలు వ్యతిరేకంగా ఉంటే, వారి విషయంలో ఆయా పార్టీల వైఖరి ఏమిటో ? వెల్లడించాలి” అని డిమాండ్ చేశారు.

సోమవారం ఇక్కడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని జేఏసీ కార్యాలయంలో కోదండరాం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించటానికే ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాపథంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిలదీతలకు స్పందన బాగుందన్నారు. అయితే నిరసన తెలిపిన వారిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వయంగా ఎదురుదాడికి దిగటం అన్యాయమన్నారు.

ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఓదార్పు యాత్ర సందర్భంగా నిరసన తెలిపిన తెలంగాణ వాదులపై తన ప్రైవేట్ సైన్యంతో దాడి చేయించిన వైఎస్ జగన్‌పైనా ప్రభుత్వం కేసులు పెట్టాలని కోరారు. ప్రజా జీవితంలో కొనసాగుతూ..తెలంగాణను అడ్డుకున్న జగన్‌ను ప్రశ్నించే అధికారం ఇక్కడి ప్రజలకు ఉందని స్పష్టంచేశారు. జగన్ సంబంధీకులు, పోలీసులు కుమ్మక్కైయ్యారని ఆరోపించారు.

తెలంగాణ వాదులపై దాడులు చేయటమేకాక, కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వ్యవహారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే తాము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. జగన్ ప్రైవేట్ సైన్యం బారి నుంచి తెలంగాణ వాదులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రజలందరి డిమాండ్ మేరకు తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం అంటూ ఎంఐఎం నివేదిక ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎంఐఎం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ వ్యవహరించాలని కోరారు. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ ఆకస్మికంగా రావటం కంటే..ముందస్తు సమాచారంతో వస్తే బాగుండేదన్నారు. కమిటీ ఆకస్మికంగా వచ్చినప్పటికీ, ప్రజల నుంచి విపరీత స్పందన ఉందని చెప్పారు.

Source: Andhra Jyothy

You might be interested in :